హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): మత్తుమాఫియా రెచ్చిపోతున్నది. పోలీసుల కన్నుగప్పి కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను విదేశాల నుంచి దేశంలో కుమ్మరిస్తున్నది. యువతను బానిసను చేసి కోట్ల రూపాయలు దేశం దాటిస్తున్నది. కండ్లముందే అంతా జరుగుతున్నా డ్రగ్స్ ఎవరు, ఎక్కడి నుంచి, ఎక్కడికి పంపుతున్నారు? అనే ప్రశ్నలకు సమధానం దొరకడం లేదు. డీఆర్ఐ అధికారులకు పట్టుబడుతున్నవారు పాత్రధారులుగానే మిగులుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెలలో రూ.97.5 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. 6న 12 కిలోలు, సోమవారం రూ.19.5 కోట్ల విలువైన హెరాయిన్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు పట్టుకొన్నారు. హైదరాబాద్తోపాటు చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లోని విమానాశ్రయాల్లో కలిపి రూ.300 కోట్ల విలువైన 53 కిలోల హెరాయిన్ పట్టుబడింది. లాక్డౌన్ వల్ల రోడ్డు, జల మార్గాల ద్వారా డ్రగ్స్ తరలించటం కష్టంగా మారటంతో డ్రగ్స్ మాఫియా విమానాలను ఎంచుకుంటున్నది. డ్రగ్స్ తీసుకొస్తూ పట్టుబడిన ఆఫ్రికన్లు వారిదేశాల్లో రోడ్లపక్కన దుస్తుల విక్రయం, మరికొందరు చిన్న ఉద్యోగాలు చేసుకునేవారని దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి. డబ్బు ఆశచూపి వీరిని పావులుగా మార్చుకుంటున్నట్టు తేలింది. విజిటింగ్ వీసాలు, మెడికల్ వీసాలపై కొంత లగేజీని ఇచ్చి వాటిలో అనుమానం రాకుండా మత్తు పదార్థాలు ఉంచి పంపుతున్నారు. వీరికి ఫలానా ప్రాంతానికి వెళ్లాలనే చెప్తారు. అక్కడికి వచ్చి సరుకు తీసుకెళ్లే ముఠా మరొకటి ఉంటుంది. వారికి వీరికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. అంతా ఫోన్లలోనే జరిగిపోతుంది. అందుకే డ్రగ్స్ తెస్తున్న పెడ్లర్లను పట్టుకోగలుగుతున్నా అసలు సూత్రధారులను, ఎవరికి సరఫరా చేయబోతున్నారన్న లింక్ మాత్రం దొరకటం లేదు. డ్రగ్స్తో దొరికిపోయినవాళ్లు మాత్రం ఏండ్లకొద్దీ జైళ్లలో మగ్గాల్సి వస్తున్నది.