శంషాబాద్ రూరల్, మే 16: ఇటుకబట్టీలో పనిచేస్తున్న ఒడిశా కార్మికులపై దాడి నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కదిలిన కార్మికశాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఇటుకబట్టీ యజమానిపై కేసు నమోదు చేశారు.. ఈ సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ ప్రకాశ్ రెడ్డి, బాధితుల వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన 26 మంది కార్మికులు శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామ పరిధిలో ఉన్న రెడ్యానాయక్ అనే వ్యక్తికి చెందిన ఇటుకబట్టీలో పని చేస్తున్నా రు.
ఆరు నెలలుగా కార్మికులకు ఇవ్వాల్సిన రూ.5 లక్షలు ఇవ్వడంలేదు.. డబ్బుల విషయమై గత గురువారం రాత్రి కార్మికులు, రెడ్యానాయక్ మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఘర్షణలో కార్మికులు కుసుమ, ఆమె భర్త బలభద్ర, గంగా, ముక్త, సంతోష్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మరో కార్మికుడు నవీన్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో కార్మికులపై ఇటుక బట్టి యజమాని దాడిచేశాడని పోస్టు చేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. ఇటుకబట్టీ యజమానిపై చర్యలు తీసుకోవాలని కార్మికశాఖ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి సమాచారం అందుకున్న శంషాబాద్ కార్మికశాఖ అధికారి నిష్మిత ఫిర్యాదు మేరకు పోలీసులు యజమాని రెడ్యానాయక్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చపట్టారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఆదివారం శంషాబాద్ కార్మికశాఖ అధికారి నిష్మిత రెడ్యానాయక్కు చెందిన ఇటుకబట్టిని సందర్శించి .. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆరు నెలలుగా పని చేస్తున్నామని.. ఇప్పటి వరకు కూలీ డబ్బులు ఇవ్వలేదని.. మొత్తం రూ.5 లక్షలు ఇవ్వాల్సి ఉందని.. ఈ విషయం అడిగితే దాడికి పాల్పడ్డాడని కార్మికులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ.. కార్మికులకు డబ్బులు ఇప్పించిన తర్వాత… వారిని వారి స్వగ్రామానికి పంపిప్తామని తెలిపారు.. డబ్బులు ఇచ్చేవరకు కార్మికులకు భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తానని సదరు యజమాని రెడ్యానాయక్ హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. కాగా గురువారం రాత్రి మద్యం మత్తులో ఉన్న కార్మికుడు బైక్ అడిగితే ఇవ్వనందుకే తనపై దాడి చేశారని ఇటుకబట్టి యజమాని రెడ్యానాయక్ తెలిపారు.