అమరావతి: రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఎటువంటి అన్యాయం జరుగనివ్వమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేశ్ హామీ ఇచ్చారు. పలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యా సంస్థలు తమ సంస్థలతోపాటు లెక్చరర్లను ప్రభుత్వానికి హ్యాండోవర్ చేశాయని సోమవారం మీడియాకు చెప్పారు. కుటుంబాలపై ఎటువంటి భారం పడకుండా వారి పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు.
అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాల మాదిరిగానే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామని ఆదిమూలం సురేశ్ చెప్పారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యా సంస్థల పరిస్థితిపై అధ్యయనానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ సిఫారసుల మేరకు సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి మూడు ప్రతిపాదనలు చేశారన్నారు. సంబంధిత విద్యా సంస్థలు స్వచ్ఛందంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ బెనిఫిట్లను ఉపసంహరించుకోవడం గానీ, ప్రభుత్వానికి అప్పగించడం గానీ, ప్రైవేట్ విద్యా సంస్థలుగా నిర్వహించుకోవడం గానీ చేయొచ్చునని సూచించారని ఆదిమూలం సురేశ్ చెప్పారు.
133 డిగ్రీ కళాశాలల్లో 125 సంస్థలు దాదాపు 93 శాతం సంస్థలు స్వచ్ఛందంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ వదులుకునేందుకు ముందుకు వచ్చాయని, ప్రభుత్వానికి సిబ్బందిని అప్పగించాయని ఆదిమూలం సురేశ్ చెప్పారు. మరో 5-7 విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా తమ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు వచ్చాయన్నారు.