తిరుమల: తిరుమల క్షేత్రంలోని అంజనాద్రి కొండపై ఆంజనేయస్వామి వారు జన్మించిన ఆకాశ గంగ తీర్థం వద్ద హనుమాన్ జయంతి వేడుకలను శుక్రవారం తొలిసారిగా ప్రారంభించినట్లు టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలను అకాశగంగ, జాపాలి వద్ద నిర్వహిస్తామని చెప్పారు.
ఉత్సవంలో భాగంగా ఆకాశగంగ వద్ద అంజనాదేవి, బాల ఆంజనేయస్వామివారికి నిర్మించిన ఆలయంలో అభిషేకం, తమలపాకులతో పూజ, మల్లె పూలతో అర్చన నిర్వహించామన్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, మొదటి ఘాట్రోడ్డులోని ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహించినట్లు తెలిపారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపధ్యంలో ఇక్కడకు రాలేని భక్తులు ఎస్వీబిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి స్వామివారి అనుగ్రహనికి పాత్రులు కావాలని కోరారు. ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన టీటీడీ సిబ్బందిని ఆయన అభినందించారు.