తిరుపతి, మే 24: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు.
సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే వృక్షలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్టించిన స్వామిని దర్శించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అనంతరం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారికి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. కాగా సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో రవికుమార్ రెడ్డి, కంకణ బట్టార్ ఎ.టి. పార్థసారధి దీక్షితులు, సూపరింటెండెంట్ వేంకటాద్రి, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.