అర్ధ్ధరాత్రి పోలీసుల కండ్లలో కారం చల్లిన నేతలు
మహిళా కానిస్టేబుళ్లపై దాడి.. మరో ఇద్దరికి గాయాలు
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): అటవీ భూములకు పట్టాలు జారీ చేయాలంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు కొత్త నాటకానికి తెరతీశారు. జిల్లాలో అటవీభూములకు పట్టాలు ఇవ్వాలంటూ బీజేపీ నాయకుడు పాల్వాయి హరీశ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, అటవీ భూములు సాగు చేస్తున్నవారు గురువారం పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో నిరసన దీక్ష చేపట్టారు. శాంతియుతంగా ఒకేరోజు నిరసన తెలుపాలని పోలీసులు అనుమతి ఇచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా బీజేపీ నాయకులు రెండో రోజూ సైతం ఆందోళన కొనసాగించారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు దీక్ష విరమింపచేసేందుకు ప్రయత్నం చేస్తుండగా, బీజేపీ నాయకులు పోలీసుల కళ్లల్లో కారం చల్లడంతో పాటు మహిళా కానిస్టేబుళ్లపై దాడి చేశారు. మహిళా కానిస్టేబుళ్లు తిరుపతిబాయి, కోమళికి గాయాలయ్యాయి. వీరితోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఫరీద్, దీపక్ కూడా గాయపడ్డారు. దీక్ష చేస్తున్న వారిని పోలీసులు పెంచికల్పేటకు తరలించారు. కాగా, కొండపల్లిలో 75 హెక్టార్లలో అటవీ భూమిని గిరిజనులు, గిరిజనేతరుల సాగుచేస్తున్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తుండగా బీజేపీ నాయకులు రాజకీయం చేయడం పట్ల పలువురు మండిపడుతున్నారు. కమలం పార్టీ నాయకులకు గిరిజనుల సమస్యను రాజకీయాలకు వాడుకోవద్దని సూచిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 కంటే ముందు నుంచి పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు అటవీ హక్కుల పత్రాలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నదని.. కానీ, పెంచికల్పేట ప్రాంతంలోని 75 హెక్టార్ల అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వారిలో ఇద్దరు ఎస్సీ రైతులు, మిగితా వారి బీసీలు ఉన్నారని జిల్లా అటవీశాఖ అధికారి శాంతారం తెలిపారు. అటవీ భూములకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తామని చెప్పారు.