శ్రీశైలం : కృష్ణా నది ఎగువ తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వస్తున్న వరదనీటి ప్రవాహం పెరుగుతూ ఉంది. మూడు రోజులుగా నిలకడగా వస్తున్న వరద నీరు గురువారం రాత్రి నుండి ఒక్కసారిగా పెరిగింది. జూరాల ప్రాజెక్ట్ నుండి గేట్ల ద్వారా 1,68,869 క్యూసెక్కులు, విద్యుదోత్పత్తి ద్వారా 28,166 క్యూసెక్కులు మొత్తం కలిపి 1,92,035 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 81,049 క్యుసెక్కుల నీరు శ్రీశైలం రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్ట్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 849 అడుగులు ఉండగా, 77.85 90 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.