శ్రీశైలం : కృష్ణా నది ఎగువ తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. రెండు రోజులుగా రిజర్వాయర్ ఇన్ ఫ్లో పుంజుకుంది. జూరాల ప్రాజెక్ట్ నుండి గేట్ల ద్వారా 59,598 క్యూసెక్కులు, విద్యుదోత్పత్తి ద్వారా 29,308 క్యూసెక్కులు కాగా మొత్తం కలిపి 88,906 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1,58,412 క్యుసెక్కుల నీరు శ్రీశైలం రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 837 అడుగులు ఉండగా, 58.7052 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం నుండి విద్యుతోత్పత్తి ద్వారా 28,252 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా కుడిగట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుతోత్పత్తి జరగడం లేదని అధికారులు తెలిపారు.