అధిక దిగుబడులు సాధించాలన్న ఆత్రుత అన్నదాతను రసాయన ఎరువులవైపు అడుగులేయిస్తున్నది. ఫలితంగా, ఆహార పంటలు కలుషితం అవుతున్నాయి. భూసారం దెబ్బతింటున్నది. క్రమంగా పంటల్లో సూక్ష్మ, స్థూల పోషకాలు లోపిస్తున్నాయి. చీడపీడల ఉధృతి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో రసాయన ఎరువులకు.. ‘పచ్చిరొట్ట’ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.
రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైన ‘పచ్చిరొట్ట’ ఎరువులపై దృష్టిపెట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పచ్చిరొట్టపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ఒక నివేదికను విడుదల చేసింది.
సహజంగానే ఎన్పీకే: పచ్చిరొట్టతో పంటలకు అవసరమయ్యే ఎన్పీకే ఎరువు సహజంగా దొరుకుతుంది. వరితోపాటు ఏ ఇతర పంటలు సాగు చేసినా, ఎక్కువగా యూరియా, ఎన్పీకే ఎరువులనే ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో పచ్చిరొట్టను సాగు చేయడం వల్ల, పొలాల్లో సహజంగానే ఈ ఎరువులు ఉత్పత్తి అవుతాయి. భూసారం పెరుగడంతోపాటు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. దిగుబడి కూడా అధికం అవుతుంది.
పదహారు రకాల ఎరువులు: మొత్తంగా పదహారు రకాల పచ్చిరొట్ట ఎరువులను వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జీలుగ, అవిశ, జనుము, వెంపల్లి, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము, గోడు చిక్కుడు, అజొల్ల, కానుగ, వేప, ైగ్లెరిసిడియా, జిల్లేడు, నేతల తంగేడు, కొండ మిరుప మొక్కల ఆకులు సహజ సిద్ధమైన ఎరువులుగా ఉపయోగపడనున్నాయి. అవేంటో పరిశీలిస్తే..
జీలుగ: ఈ రకం పచ్చిరొట్ట మొక్కలను చౌడు భూముల్లో, వరి పండించే భూముల్లో వేసుకోవచ్చు. ఎకరానికి 20 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. మొక్కలు పెరిగి, పూత దశకు వచ్చేసరికి ఆరు నుంచి ఎనిమిది టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. వీటిని అదే పొలంలో కలియదున్ని, మురుగ పెట్టినట్లయితే 30 నుంచి 32 కిలోల యూరియా లభిస్తుంది. ఈ మొక్కలు పెంచడం వల్ల పొలంలో వేయాల్సిన యూరియా కన్నా 30 నుంచి 32 కిలోలు తక్కువగా వేసినా సరిపోతుంది. వీటి ద్వారా 3.5శాతం నత్రజని, 0.6 శాతం భాస్వరం, 1.2శాతం పొటాష్ లభిస్తుంది.
జనుము: ఎకరానికి 9 నుంచి 14 కిలోల విత్తనాలు అవసరం ఉంటుంది. దీని ద్వారా ఎకరానికి ఐదు నుంచి ఆరు టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. వీటిని పొలంలోనే కలియదున్నితే 24 కేజీల యూరియా అందుతుంది. ఇందులోనూ 2.3శాతం నత్రజని, 0.5శాతం భాస్వరం, 1.8శాతం పొటాష్ ఉంటాయి.
పెసర, మినుము: పెసర, మినుముల పచ్చిరొట్టతో ఎకరానికి 15 నుంచి 20 కిలోల యూరియా అందిస్తుంది. వరి సాగు చేసే పొలాల్లో వీటిని వేసుకోవడం వల్ల అధిక లాభం ఉంటుంది.
భారీగా నత్రజని: అవిశ పంటకు ఎకరానికి 16 కేజీల విత్తనాలు అవసరం అవుతాయి. దీని ద్వారా సుమారు 40 కేజీల నత్రజని ఉత్పత్తి కావడం విశేషం. అదేవిధంగా సెస్బానియాను వేయాలనుకుంటే ఎకరానికి 16 కేజీల విత్తనాలు వేసుకోవాలి. దీనిద్వారా ఎకరం పొలానికి 70 కేజీల దాకా నత్రజని లభిస్తుంది. ఇక అలసంద విషయానికి వస్తే, ఎకరానికి 15 కేజీల విత్తనాలు అవసరం ఉంటుంది. ఈ మొక్కలను పొలంలోనే కలియదున్నితే, 60 కేజీల వరకు నత్రజని ఉత్పత్తి అవుతుంది. పిల్లి పెసరను సాగు చేయాలనుకుంటే ఎకరానికి కేవలం ఆరు కేజీల విత్తనాలు సరిపోతాయి. అయితే, దీనిద్వారా ఏకంగా 40 కేజీల నత్రజనిని పొలంలో ఉత్పత్తి చేసుకోవచ్చు.
రెండు విధాలుగా: రెండు రకాలుగా వీటిని సాగు చేస్తారు. ఒకటి.. జనుము, జీలుగ, పిల్లిపెసర, ఉలవ, పెసర, అలసంద వంటి పైర్ల విత్తనాలను దుక్కిలో వెదజల్లాలి. అవి పెరిగిన తర్వాత 50శాతం పూత దశలో పొలంలో కలియదున్ని, కుళ్లిన తర్వాత పంటను వేసుకోవాలి. రెండోది.. వేప, తంగేడు, కానుగ, ైగ్లెరిసిడియాకు సంబంధించిన మొక్కల ఆకులను, కొమ్మలను సేకరించాలి. వాటిని పొలంలో వేసి కలియదున్ని, మురగనివ్వాలి. ఆ తర్వాత ప్రధాన పంటను వేసుకోవాలి.
సాగు విధానం
ఉపయోగాలు
రైతులకు ఎంతో మేలు
రైతులు రసాయన ఎరువులు ఉపయోగించడానికి బదులుగా పచ్చిరొట్ట సాగు చేయాలి. దీనివల్ల ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు భూసారం పెరుగుతుంది. సహజసిద్ధంగా ఎరువులు లభిస్తుండటంతో పంటలో రసాయనాల శాతం కూడా తగ్గుతుంది. తద్వారా వినియోగదారులకు స్వచ్ఛమైన ధాన్యం, దాంతోపాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది. అయితే, చాలా మంది రైతులకు పచ్చిరొట్ట గురించి ఎక్కువగా తెలియడం లేదు. అందుకోసమే, పచ్చిరొట్ట సాగుపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
–కొమ్మిడి స్వామిరెడ్డి