కామారెడ్డి జిల్లాలో గురువారం జోరువాన కురిసింది. వాగులు పొంగిపొర్లాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 39.1 మి.మీ. సరాసరి వర్షపాతం నమోదుకాగా, అత్యధికంగా గాంధారి మండలంలో 80.4 మి.మీ., అత్యల్పంగా మాచారెడ్డి మండలంలో 3.6 మి.మీ వర్షం కురిసింది. ఎగువ ప్రాంతాల నుంచి సింగీతం ప్రాజెక్టులోకి భారీ ఇన్ఫ్లో వస్తున్నది. లింగంపేటలోని పాములవాగులో ట్రాక్టర్ కొట్టుకుపోయింది.
కామారెడ్డి జిల్లాలో జోరువాన
కామారెడ్డి టౌన్, జూన్ 24 : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గురువారం జోరు వానకురిసింది. జిల్లాలో సరాసరి 39.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గాంధారి మండలంలో 80.4 మి.మీ, అత్యల్పంగా మాచారెడ్డి మండలంలో 3.6 మి.మీ వర్షపాతం నమోదైంది.
నాగిరెడ్డిపేట్లో 33.2 మి.మీ, లింగంపేట్ 26.8 మి.మీ, బాన్సువాడ 62.4 మి.మీ, ఎల్లారెడ్డి 28.2 మి.మీ, తాడ్వాయి 76.0 మి.మీ, పిట్లంలో 21.6 మి.మీ, నిజాంసాగర్ 21.4 మి.మీ, సదాశివనగర్ 31.0 మి.మీ, బిచ్కుందలో 46.6 మి.మీ, మద్నూర్లో 48.0 మి.మీ, జుక్కల్ 55.8 మి.మీ, కామారెడ్డి 21.2 మి.మీ, దోమకొండ 33.6 మి.మీ, భిక్కనూర్ 12.2 మి.మీ, బీర్కూర్లో 62.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.
సింగీతంలోకి భారీ ఇన్ఫ్లో
నిజాంసాగర్, జూన్ 24: సింగీతం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీ ఇన్ఫ్లో వస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ శివకుమార్ తెలిపారు. వర్ని, గాంధారి మండలాల్లో వర్షం కురవడంతో గురువారం తెల్లవారుజాము నుంచి సింగీతం ప్రాజెక్టులోకి సుమారు 1000 క్యుసెక్కుల చొప్పున ఇన్ఫ్లో వస్తున్నది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో లేదని, గురువారం సాయం త్రానికి ప్రాజెక్టులో 1395.47 అడుగుల (7.19 టీఎంసీల) నీరు నిలువ ఉన్నట్లు పేర్కొన్నారు.
ఎస్సారెస్పీకి నిలిచిన వరద
మెండోరా, జూన్ 24 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కుఎగువ నుంచి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. కాకతీయ కాలువకు 50 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతున్నది. ఆవిరి, లీకేజీ రూపంలో 406 క్యూసెక్కులు పోతుండగా, 152 క్యూసెక్కులు మిషన్ భగీరథ తాగునీటికోసం వినియోగిస్తున్నట్లు ఏఈఈ తెలిపారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1067.80 అడుగుల (24.954 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ఏఈఈ వివరించారు.