టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్
ప్రభుత్వ దవాఖానకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్, పల్స్ ఆక్సిమీటర్లు అందజేత
ఊట్కూర్, జూన్ 20 : కరోనా విపత్కర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఆరోగ్య సేవలందిస్తున్న డాక్టర్ల రుణం తీర్చుకోలేనిదని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ రవీందర్గౌడ్ అన్నారు. కిసాన్ బంధు స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ దవాఖానకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్, వైద్య సిబ్బంది, విలేకరులకు పల్స్ ఆక్సిమీటర్లు, కరోనా రోగులకు మెడికల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారితో బాధపడుతూ సరైన సమయానికి ఆక్సిజన్ అందక పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకునే చర్యలతోపాటు సామాజిక బాధ్యతగా కిసాన్ బంధు, టీవీవీ ఆధ్వర్యంలో ఊట్కూర్, మద్దూర్, కొడంగల్, బొంరాస్పేట్ దవాఖానలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్లను సమకూర్చినట్లు తెలిపారు.
ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ కరోనాతో బాధపడుతున్న వారికి విశేష సేవలందిస్త్తున్న టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్ను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరూ చేతనైనంతలో పేదలకు సహాయం అందించాలని కోరారు. పలువురు ఆయనను అభినందించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, బిజ్వారం సర్పంచ్ సావిత్రమ్మ, ఉపసర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, టీవీవీ జిల్లా కోశాధికారి సూర్యప్రకాశ్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సలీం, బీజేపీ జిల్లా కార్యదర్శి ఆశప్ప, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.