అవమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్రెడ్డి స్వయానా బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోని కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. తనకు హత్యతో ఎలాంటి సంబంధం లేదని, వివేకాతో సన్ని హితంగా ఉండటం వల్లే తనను ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. సీబీఐ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నదని త్వరలో వాస్తవాలు వెలుగుచూస్తాయని గంగిరెడ్డి పేర్కొన్నారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగయ్య తనపై చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. రంగన్నను వివేకా ఇంట్లో చూశానే తప్పా ఏ రోజూ మాట్లాడలేదన్నారు. అతడు ఏం ఆశించి తనపై ఆరోపణలు చేస్తున్నాడో అర్థకావడం లేదన్నారు. తానెవరినీ బెదిరించలేదని, అలా చేసినట్లు ఎక్కడా తనపై కేసులు లేవని గంగిరెడ్డి అన్నారు.
ఇదిలా ఉండగా గంగిరెడ్డి వ్యాఖ్యలపై వాచ్మెన్ రంగన్న సైతం స్పందించారు. తాను గంగిరెడ్డితో చాలాసార్లు మాట్లాడానని, ఇప్పుడు గంగిరెడ్డి తానెవరో తెలియనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. తనకేమీ కాదని అంటేనే సీబీఐకి అన్ని విషయాలు చెప్పానన్నారు. నిన్న జమ్మలమడుగు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట రంగయ్య వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే.