అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటింగ్కు అనుమతించడంతో అందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. మార్చి 10న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి. 56.86 పోలింగ్ శాతం నమోదైంది.
కాగా ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వంతోపాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మేలో జరిగిన విచారణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంటూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.