హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్తు సంక్షోభం అంచున నిలిచింది. విద్యుత్తుశాఖ మంత్రితోపాటు అధికారులు జారీచేసిన ప్రకటనలే ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. బొగ్గుకొరతతో ఆ రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో సుమారు 40 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్తు ఉత్పత్తి తగ్గిందని ఉన్నతాధికారులు ప్రకటించారు. అన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఒకటిరెండు రోజులకు సరిపడేంత బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడంతో రైల్వే ర్యాక్ల సంఖ్య పెరిగిందని చెప్తున్నారు. అయినప్పటికీ చాలాచోట్ల విద్యుత్తు కోతలు గంటల తరబడి తప్పడంలేదు. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి రోజూ నాలుగు గంటలపాటు పరిశ్రమలకు విద్యుత్తును నిలిపివేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్ర 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు వాడవద్దని ఇంధనశాఖ కార్యదర్శి విజ్ఞప్తిచేశారు. మిగిలిన జిల్లాల్లోనూ అనధికారికంగా కోతలు మొదలయ్యాయని సమాచారం. వార్షిక మరమ్మత్తుల పేరుతో రాయలసీమ థర్మల్ పవర్ప్లాంట్ను మూసివేశామరిచ మూయకపోయినా బొగ్గుకొరతతో మూతపడేదని రాష్ట్ర మంత్రి స్వయంగా చెప్ప డం అక్కడి విద్యుత్తు సంక్షోభ తీవ్రతను తెలుపుతున్నది.
ప్రైవేటులో మండిపోతున్న ధర
ప్రజల అవసరాలమేరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేసే పరిస్థితికూడా కనపడటం లేదని ఏపీ అధికారులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్తు యూనిట్ రేటు ఊహించని స్థాయికి చేరింది. సెప్టెంబర్ 16న యూనిట్కు రూ.4.60 ధర ఉంటే, సెప్టెంబర్ నెలాఖరుకు రూ.9.40కి, అక్టోబర్ 6 నాటికి రూ.14కు పెరిగింది. దీంతో అంత ధర పెట్టి కొనలేమని అక్కడి ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది. దేశవ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్కు, సరఫరాకు మధ్య సుమారు 2000 మెగావాట్ల తేడా ఉన్నది. దీని ప్రభావం అన్ని రాష్ర్టాలపై ఉన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్పై కూడా పడింది.
సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు ఏసీలు ఆపేయండి. విద్యుత్తు డిమాండ్, సరఫరాల మధ్య అంతరం ఉన్నది. మూడురోజులుగా రద్దీ సమయాల్లో కొన్నిచోట్ల కోతలు అమలవుతున్నాయి. సాయంత్రం అధిక ధరపై విద్యుత్తు కొనుగోలుకయ్యే ఖర్చును ఆదా చేసుకోవడానికి, భవిష్యత్తులో సర్దుబాటు చార్జీలు పడకుండా ఉండేందుకు ఇలా చేయాలని ప్రజలను కోరుతున్నాం’ -ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్
జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నాం. ఫుడ్ప్రాసెసింగ్ మినహా అన్ని పరిశ్రమలకు సరఫరా ఉండదు. -శ్రీకాకుళం విద్యుత్తు అధికారులు.
అన్ని రాష్ర్టాలు ఏదో ఒక స్థాయిలో విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్నాయి. మనరాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమే. బొగ్గు కొరత దృష్ట్యా యూనిట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఉన్నది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు రాయలసీమ థర్మల్ పవర్ప్లాంట్ (ఆర్టీపీపీ)లో వార్షిక మరమ్మత్తులు చేపట్టాం. ఇలా చేయకపోయినా బొగ్గుకొరత వల్ల వాటిని మూసి వేయాల్సి వచ్చేది.
-ఏపీ ఇంధన శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి