రోజుకో కొత్త ఎత్తుగడలతో సైబర్ నేరగాళ్లు రూ.లక్షల్లో కాజేస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు అర్హత పరీక్ష ఐఈఎల్టీఎస్(ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) లో మంచి మార్కులు ఇప్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఓ యువతికి రూ.8.5 లక్షలు టోకరా వేశారు. ఎస్సార్నగర్లో ఉండే ఓ యువతి ఐఈఎల్టీఎస్ పరీక్షకు సిద్ధమవుతున్నది. ఇంటర్నెట్లో కొన్ని వెబ్సైట్లు చూస్తుండగా శిక్షణ ఇచ్చి, పరీక్ష రాయించి మంచి స్కోర్ తెప్పిస్తామనే ప్రకటన కనిపించింది. అందులో నెంబర్కు ఫోన్ చేయగా, తొలుత కొంత డబ్బు చెల్లించాలని సూచించి రూ.లక్ష వసూలు చేశారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రానికి రావాలని, పరీక్ష రాయిస్తామంటూ నమ్మిస్తూ పలు దఫాలుగా రూ.8.5 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బు అడుగుతుండడంతో అనుమానం కలిగి శనివారం ఆమె సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.