అమరావతి : వేసవి సెలవులు, కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో ఒకటి నుండి తొమ్మిదో తరగతి విద్యార్థులకు డ్రై రేషన్ను పంపిణీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఆయా పాఠశాలలో యధావిధిగా కొనసాగనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం మంగళవారం నుండి వేసవి సెలవులను ప్రకటించింది.
1 నుండి 9 తరగతుల విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అయినట్లు పేర్కొంది. కాగా కొవిడ్ నిబంధనలను అనుసరించి ఇంతకుముందే తెలిపిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. స్కూల్ అథారిటీ సూచన మేరకు ఉపాధ్యాయులందరూ అన్ని పని దినాల్లో పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది.