అమరావతి: ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ కావాలనేది ఆమె కల. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగింది. వైసీపీ అభ్యర్థిగా స్థానిక సంస్థల ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టింది. హోరాహోరి సాగిన ఎన్నికల ప్రచారంలో తను అందరినీ కలిసి ఆప్యాయతగా పలుకరిస్తూ ఓటు తనకే వేయాలని అభ్యర్థించింది. ఫలితం వెలువడక ముందే ఆమె పట్ల విధి చిన్నచూపు చూపింది. కారోనా మహమ్మారి ఆమెను కాటేసింది. కానీ ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించింది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా కర్లపాలెం-1 ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా దొంతిబోయిన ఝాన్సీలక్ష్మి పోటీ చేశారు. కాగా ఆమె జూన్లో కరోనా వ్యాధితో మరణించారు. ఎంపీటీసీ ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. అయితే దొంతిబోయిన ఝాన్సీలక్ష్మి తన ప్రత్యర్థిపై 134 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులు ఆమెను తలుచుకుంటూ విషాదంలో మునిగారు. ఝాన్సీలక్ష్మి ఉంటే ఎంతో సంబరపడేవారని కన్నీటిపర్యంతమయ్యారు.