శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సభ్యులతో కలసి వచ్చేవారంతా లాక్డౌన్ నిబంధనల కారణంగా పదుల సంఖ్యలో మాత్రమే క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్నవారికే ఆలయ ప్రవేశం కల్పిస్తున్నారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రాల నుండి ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో భక్తుల రాక తగ్గిపోయి క్షేత్ర వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అదే విధంగా సొంత వాహనాలతో దర్శనానికి వచ్చే యాత్రికులకు క్షేత్రంలో బస చేసేందుకు వసతి సదుపాయాలు కల్పించనందువల్ల వెంటనే తిరిగి వెళ్లిపోవాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.
పూజలు యథాతధం..
శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు యథాతధంగా జరుగుతున్నాయని ఈవో కేఎస్ రామారావు తెలిపారు. లోక కళ్యాణార్ధం బుధవారం ఉదయం పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలతో పాటు ఆలయ ప్రాంగణం ఉత్తరంవైపున కొలువైన జ్వాలా వీరభద్రునికి
ప్రదోషకాల ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు చేశారు. దీనివలన గ్రహపీడలు దూరమై ప్రజలంతా ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని ప్రధాన అర్చకులు తెలిపారు.