మరేదైనా రాష్ట్రంలో అమలు చేస్తున్నారా..?
రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలు
ఈటలది అహంకారం.. పథకాలను ఎట్ల విమర్శిస్తడు
ఆయన రాకముందే టీఆర్ఎస్ ఎంతో బలంగా ఉంది
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
వీణవంక, హుజూరాబాద్ మండలాల్లో రైతు వేదికలకు ప్రారంభోత్సవం
హుజూరాబాద్ /హుజూరాబాద్ రూరల్/ వీణవంక, జూన్ 29: వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇలాంటి పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలు అని, రైతులకు నిత్య శిక్షణ కేంద్రాలుగా ఉపయోగపడుతాయని అభివర్ణించారు. మంగళవారం వీణవంక మండలం కోర్కల్, హుజూరాబాద్ మండలం సింగాపూర్, చెల్పూర్ గ్రామాల్లో రైతు వేదికలు ప్రారంభించి, ఆయా చోట్ల మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేసిన చట్టాలతో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం లేదని, ఆ చట్టాల్లోనే చాలా కిరికిరిలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్షలాది మంది రైతులు సదరు చట్టాలను రద్దు చేయాలని నెలల తరబడి నిరసన తెలుపుతున్నా కేంద్రం మాత్రం ఒంటెద్దు పోకడలకు పోతున్నదని, చట్టాలను వెనక్కి ఎందుకు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మొత్తానికి కొత్త చట్టాన్ని పరిశీలిస్తే వ్యవసాయ ఉత్పత్తులు వ్యాపారుల చేతుల్లోకి వెళ్తాయని కరాఖండిగా చెప్పవచ్చని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం నూట పదహారు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అందులో 6లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విషయం మరిచి కేవలం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నదని నానా రభస చేస్తున్నారని, అయితే మన అప్పులకు కండ్ల ముందే ఫలితాలు కనబడుతున్నాయని ఉద్ఘాటించారు. ప్రాజెక్టుల నిర్మా ణం, రైతు బంధు, 24గంటల కరెంటు, పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతుంటే కేంద్రం ఓర్వలేని తనం చేస్తుందని మండిపడ్డారు. ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మహా అద్భుతమని, దీని విశిష్టతను డిస్కవరీ చానల్లో ప్రచారం చేయడంతో ప్రపంచానికి మన ఇంజినీర్ల గొప్పతనం తెలిసిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన పంటలకు డిమాండ్ ఉందని, రైతులు దీనిపై ఆలోచన చేయాలని సూచించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించడం ఈటల రాజేందర్ అహంకారానికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు. ఈటల రాకముందే కమలాపూర్ టీఆర్ఎస్కు కంచుకోటని, రేపు రాబోయే తెలంగాణ ఫలితాలకు హుజూరాబాద్ వేదిక కానుందని స్పష్టం చేశారు. ప్రాణంపోయినా టీఆర్ఎస్ వ్యతిరేకులను సహించేదిలేదని తేల్చిచెప్పారు.
సర్పంచ్ కోరిన పనులు త్వరలోనే నెరవేరుతాయి
కమ్యూనిటీ కల్లాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని, అదే విధంగా గ్రామంలో అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని చెల్పూర్ గ్రామ సర్పంచ్ నేరేళ్ల మహేందర్గౌడ్.. మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించారు. త్వరలోనే వాటిని నెరవేర్చేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు. దీనికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
రైతుబంధు వద్దన్న నీవు.. లక్షలు ఎలా తీసుకున్నవ్?
-ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
రైతుబంధు వద్దన్న ఈటల మరి ఇన్ని రోజులు లక్షల రూపాయలు ఎలా తీసుకున్నాడో చెప్పాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేక అభిమానమని, అందుకే రైతు బం ధు వంటి గొప్ప పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప పథకాన్ని ఈటల రాజేందర్ పరిగే అని విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది పేదలను కించపరచడమేనని మండిపడ్డారు. దళితుల కోసం వేల కోట్లతో కొత్త పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకువస్తున్నారని వివరించారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నదని.. ఇందులో 24గంటల కరెంటు ఒకటని చెప్పా రు. పెట్టుబడి కోసం రైతు బంధు, కుటుంబ పెద్ద చనిపోతే రైతు బీమాతో రూ.5 లక్షల జీవిత బీమా, కొనుగోలుకు అన్ని సౌలతులు కల్పించిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు. రాష్ట్ర సర్కారు ఇన్ని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయ బావులకు విద్యుత్ మీటర్లు పెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఎన్ని రాష్ర్టాలు ఒప్పుకున్నా సీఎం కేసీఆర్ మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మేధోమథనం నుంచి పుట్టిందే రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలని చెప్పారు. రైతుల కండ్లలో ఆనందం చూడడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎంపీపీలు ఇరుమల్ల రాణి, ముసిపట్ల రేణుక, జడ్పీటీసీలు పడిదం బక్కారెడ్డి, మాడ వనమాల, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ చొల్లేటి కిషన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు పాల్గొన్నారు.