ఏపీలో ఉద్యోగ నియామకాలకు తేదీల ఖరారు

అమరావతి: కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాయిదా వేసిన ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 27వ తేదీ వరకు వివిధ విభాగాల్లో ఉద్యోగాల నియామక పరీక్షలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 15,16 తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు, సెప్టెంబర్ 21 నుంచి 24వరకు గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.
సెప్టెంబర్ 21,22 తేదీల్లో అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు,సెప్టెంబర్ 22న రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ మైనింగ్ సర్వీస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 23న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు, పోలీస్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్, 23,24న పట్టణ ప్రణాళిక అసిస్టెంట్ విభాగంలో డైరెక్టర్ పోస్టులు, టౌన్ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నియామక పరీక్ష నిర్వహించనున్నామని ఆయన వివరించారు.
అదే రోజు ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలు, 25,26,27 తేదీల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియాక పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. నవంబర్ 2 నుంచి 13వరకు గ్రూప్ 1 ఉద్యోగాల నియామక పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.