కరీంనగర్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా ప్రైవేటు విద్యా సంస్థలు మూసి వేయడంతో అందులో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అసలే అరకొర జీతాలు.. ఆపై ఉపాధి కూడా పోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు లోనయ్యారు. కుటుంబ పోషణ ఎలా? అంటూ మదనపడ్డారు. వారి అవస్థలను మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారందరికీ సహాయం అందించాలని కొద్ది రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సంబంధిత పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి, ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో పాఠశాలల యజమాన్యాలు జాబితాలను జిల్లా విద్యాధికారులకు సమర్పించగా, వాటిని పరిశీలించిన అధికారులు తొలి విడుత జాబితాను తయారు చేసి, ప్రభుత్వానికి పంపించారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 9,510 మందికి రూ.2 వేల చొప్పున నగదు విడుదల చేసింది.
ప్రభుత్వం మాకు అండగా నిలిచింది..
కరోనా కారణంగా మా ప్రైవేట్ టీచర్ల బతుకులు ఆగమైపోయినయ్. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మాకు అండగా నిలిచింది. నగదుతోపాటు సన్న బియ్యాన్ని ఇచ్చి మా కుటుంబాలను నిలబెడుతున్నది. చాలా సంతోషంగా ఉంది. ఈ కష్ట కాలంలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు.
కేసీఆర్ సహాయాన్ని మర్చిపోం..
ఇంత కష్టసమయంలో మమ్మల్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చేసిన సహాయాన్ని మర్చిపోం. మధ్యాహ్నమే డబ్బులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. మేం విన్నవించిన ఆవేదనను ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇచ్చే రూ.2 వేలు కుటుంబం గడవడానికి ఆసరా అవుతాయని భావిస్తున్న.