అమరావతి : టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై క్రిమినల్ కేసు నమోదైంది. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో కర్నూలు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎన్-440కే వైరస్ పేరిట చంద్రబాబు సామాన్యులను భయాందోళనకు గురిచేశారని ఫిర్యాదు. ఫిర్యాదును అనుసరించి పోలీసులు చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్షన్ల కింద అదేవిధంగా 2005 ప్రకృతి వైపరిత్యాల చట్టం సెక్షన్-4 కింద కేసు నమోదు చేశారు.
గత నాలుగు రోజులక్రితం పార్టీ ముఖ్య నేతలతో ఆన్లైన్ ద్వారా సమావేశమైన చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఇతర వైరస్ల కంటే అత్యంత ప్రమాదకరమైందన్నారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందని తెలిపారు. ఈ వైరస్ను తొలిసారిగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారని చెప్పారు. కరోనాకు చెందిన ఇతర వైరస్ల కన్నా ఇది 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని పేర్కొన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా మాట్లాడిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ న్యాయవాది సుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏపీలో కొత్త కొవిడ్ వేరియంట్ ఉందంటూ విపక్షం విష ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నదని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విపక్ష ప్రచారం వల్లే ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాలు ఏపీ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించాయని ఆరోపించారు.
ఎన్440కే వైరస్ కేరళలో చాలాకాలం నుంచి ఉందని పరిశోధకులు తేల్చారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్440కే వైరస్ లేదని సీసీఎంబీ చెప్పిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఎన్440కే వైరస్ అంత ప్రమాదకరమైంది కాదని పరిశోధనల్లో తేలిందన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో విపక్షాలు బురద రాజకీయాలు మాని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు.