అమరావతి : ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న తమపై వైసీపీ ఎమ్మెల్యే జులుం ప్రదర్శించారని, తమను తొక్కుకుంటూ వెళ్లడంతో గాయపడ్డామని సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను పెంపు, చెత్తపై నూతనంగా పన్ను విధించడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట భైఠాయించి సీపీఐ (ఎం) నాయకులు ఉదయం ఆందోళనకు దిగారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లోకి వెళ్లకుండా స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబును అడ్డుకున్నారు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే రాంబాబు మెట్లపై కూర్చున్న సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్యలో నుంచి మెట్లేక్కి లోపలికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తమపై కాళ్లు పెట్టి తమను గాయపరిచారని పలువురు సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. సీపీఐ (ఎం) నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు.