జెరూసలేం: ఇజ్రాయెల్ పై పాలస్తీనా దళాలు జరిపిన రాకెట్ దాడిలో కేరళ మహిళ మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇజ్రాయెల్ లోని అష్కెలాన్ నగరంలో పనిచేస్తున్న సౌమ్య సంతోష్ తన భర్తతో వీడియో కాల్లో ట్లాడుతున్నప్పుడే ఈ ఘటన జరిగింది. హటాత్తుగా పెద్దచప్పుడు అనంతరం ఫోన్లైన్ డెడ్ కావడంతో ఆమె భర్త చుట్టుపక్కల ఉండే కేరళీయులను వాకబు చేశారు. ఆమె రాకెట్ దాడిలో మరణించినట్టు వారు చెప్పారు.
31 సంవత్సరాల సౌమ్య స్వస్థలం కేరళలోని ఇడుక్కి జిల్లా కీరితోడు. గత ఏడు సంవత్సరాలుగా ఆమె ఇజ్రాయెల్ లో పనిమనిషిగా చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మణి సీ కప్పన్ సౌమ్య మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఇజ్రేల్ రాయబారి రాన్ మల్కా పాలస్తీనా దాడిలో సౌమ్య మరణించడంపై తమ ప్రభుత్వం తరఫున సంతాపం తెలిపారు. సౌమ్య మృతితో తల్లిలేనివాడైన ఆమె 9 సంవత్సరాల కుమారుని తలచుకుంటే గుండె తరిగిపోతున్నదని ఆయన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.