హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి సెకండ్, థర్డ్ వేవ్లతో భారత్ సహా పలు దేశాలు అతలాకుతలమవుతుండగా.. మరికొన్ని దేశాలు వైరస్ నుంచి కోలుకుంటున్నాయి. కొవిడ్ నిబంధనలు అమలుచేస్తూ, వ్యాక్సినేషన్ కార్యక్రమా న్ని పకడ్బందీగా నిర్వహించిన ఇజ్రాయెల్ వంటి దేశాలు సాధారణ జనజీవితంలోకి అడుగుపెడుతున్నాయి. ఈ దేశాలు మొండివైరస్ను ఎదుర్కోగలమన్న ఆశను రేకెత్తిస్తున్నాయి. జనాభాలో కనీసం 60% మందికి టీకాలు ఇవ్వగలిగితే హెర్డ్ ఇమ్యూనిటీ (సమూహ రోగనిరోధక శక్తి) వస్తుందని, త ద్వారా వైరస్ను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 53% మందికి టీకాలు వేయ డం ద్వారా ఇజ్రాయెల్ హెర్డ్ ఇమ్యూనిటీని సాధించిందని ఉదహరిస్తున్నారు. భారత్లో ప్రస్తుతం కొనసాగుతున్న టీకాల పంపిణీ ప్ర కారం.. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడానికి ఇం కో ఏడాది పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
హెర్డ్ ఇమ్యూనిటీతోనే సాధ్యం
ఒక్కోరకం వైరస్ను ఎదుర్కొనేందుకు ఒక్కోస్థాయి హెర్డ్ ఇమ్యూనిటీ (హెచ్ఐ) అవసరమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సూచిస్తున్నది. మశూచిని అం తం చేసేందుకు 95%, పోలియోను అరికట్టేందుకు 80% హెర్డ్ ఇమ్యూనిటీ అవసరమైంది. కరోనాను అరికట్టేందుకు జనాభాలో కనీసం 60% నుంచి 70% మంది హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నది. హెర్డ్ ఇమ్యూనిటీని సాధించేందుకు రెండు విధానాలను అనుసరిస్తారు. ఒకటి ప్రజల్లో పెద్దఎత్తున వైరస్ను వ్యాపింపజేసి, మరణాల సంఖ్యను తగ్గించేలా చూడటం. ఇది అనైతికం, సమస్యాత్మకమైనది. రెండోది. వ్యాక్సినేషన్. భారీ ఎత్తున టీకాలు వేసి ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం, తద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుగోడ కట్టడం. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
మన దగ్గరా ఆ స్ఫూర్తి రావాలి
నెలక్రితం వరకు ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్ ఇన్ఫెక్షన్ రేటుతో సతమతమైంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడంతో ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలను తొలగించింది. 20 ఏండ్లు దాటిన ప్రతి ఐదుగురిలో నలుగురు టీకాలు వేసుకున్నా రు. మన దేశంలో జనవరి 16 నుంచి ఇప్పటివరకు మూడు నెలల కాలంలో 12.7 కోట్ల మంది (10%) మందే మొదటి డోసు టీకా తీసుకున్నారు. ఇదే వేగంతో దేశంలో టీకాల పంపిణీ కొనసాగితే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడానికి మరో ఏడాది సమయం పడుతుంద ని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం అంచనాల ప్రకారం, వచ్చే డిసెంబర్ నాటికి 40% మందికి, మే 2022 నాటికి 60% మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుంది.
తెలంగాణలో 7 శాతం దాటలేదు..
రాష్ట్రంలో ఇప్పటివరకు 30 లక్షల మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో 26.50 లక్షల మంది దాకా తొలి డోసు తీసుకోగా, 3.5 లక్షల మందే రెండు డోసులు తీసు కున్నారు. వీరికి తోడు మరో 3.5 లక్షల మం ది వైరస్ బారినపడి పడి కోలుకున్నారు. మొత్తంగా ఏడు లక్షల మంది ద్వారా 6% హెర్డ్ ఇమ్యూనిటీ వృద్ధి చెందింది. దీనికి మరో 10% నేచురల్ ఇన్ఫెక్షన్ (అసింమ్టమాటిక్గా ఉండి.. కొవిడ్ వచ్చిన విషయం తెలియనివా రు) కలుపుకొంటే 16% హెర్డ్ ఇమ్యూనిటీ వృ ద్ధి చెంది ఉంటుందని వైద్య నిపుణులు అం చనా వేస్తున్నారు. మే 1 నుంచి 18 ఏండ్లు దాటినవారికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం శుభపరిణామం.
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి
నేచురల్ ఇన్ఫెక్షన్, వ్యాక్సినేషన్.. ఈ రెండు ప్రక్రియల ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందుతుంది. కనీసం 60శాతానికి పైగా వృద్ధి చెందినప్పుడు వైరస్ వ్యాప్తి మందగిస్తుంది. దీన్ని త్వరగా చేరుకునేందుకు 18 ఏండ్ల పైబడిన వారికి సైతం వ్యాక్సిన్లు ఇవ్వాలని ముందు నుంచి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం మంచి విషయం. ఇతర వ్యాక్సిన్లకు అనుమతివ్వడం వల్ల వ్యాక్సిన్ కొరత తగ్గుతుంది. వ్యాక్సినేషన్ను ఇప్పుడున్న దాని కంటే వేగంగా నిర్వహించాలి. అప్పుడే మన దేశం త్వరగా హెర్డ్ ఇమ్యూనిటీ దశకు చేరుతుంది.
-డాక్టర్ రంగారెడ్డి బుర్రి, ప్రెసిడెంట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా