లాక్డౌన్తో కేసులు తగ్గుముఖం
కరోనా బాధితులకు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలు
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మానుకోట జిల్లా వైద్యశాలలో 40పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
సహకరించిన దాతలకు మంత్రి అభినందనలు
మహబూబాబాద్, మే 24 : రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా చేపట్టిన జ్వరసర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సోమవారం ఆమె రూ.68లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన అత్యాధునిక పరికరాలతో జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన 40 పడకల కొవిడ్ వార్డును ఎమ్మెల్యే శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందు, కలెక్టర్ గౌతమ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కరోనా బాధితులకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందిస్తుండడంతో కోలుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కల్పిస్తున్న అవగాహనతో ప్రజల్లో భరోసా కలుగుతున్నదన్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా వైద్యసిబ్బంది జ్వర బాధితులను గుర్తించి అక్కడికక్కడే మందులు అందిస్తుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డుతో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా భరోసాతో ఉండాలని సూచించారు.
దాతల కృషి అభినందనీయం
జిల్లా వాస్తవ్యుడు, ఢిల్లీలో తెలంగాణ మాజీ అధికారి ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ స్ఫూర్తితో ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐ) పూర్ణిమ-ప్రేమ్చంద్ దంపతులు అందించిన రూ.20.86 లక్షలతో కొవిడ్ బాధితులకు 40 పడకలు, ఇతర పరికరాలు సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. కరోనా బాధితులకు ఆదుకునేందుకు దాతలు ముందుకురావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ చేతనైన సాయం అందించాలని కోరారు. ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే శంకర్నాయక్ కొవిడ్ బాధితుల చికిత్స కోసం రూ.5లక్షలు అందించినట్లు చెప్పారు. కొవిడ్ సోకిన వారు ధైర్యంతో మహమ్మారిని తరిమికొట్టాలన్నారు. గూడూరు, తొర్రూరు, గార్ల ఆస్పత్రుల్లోనూ అన్ని రకాల సౌకర్యాలతో బెడ్లు సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎమ్మెల్యే శంకర్నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్, ఆస్పత్రి పర్యవేక్షకుడు వెంకట్రాములు, జిల్లా కొవిడ్ నోడల్ అధికారి రాజేశ్ పాల్గొన్నారు.