అమరావతి : టీడీపీ నాయకులను భయపెట్టి లొంగదీసుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి యత్నిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప మండిపడ్డారు. హత్య కేసు ఆరోపణ నేపథ్యంలో అరెస్టయిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పార్టీ నాయకులతో కలిసి ఆయన కాకినాడ సబ్ జైలు వద్ద కలిశారు. ఈ సందర్భంగా చిన్నరాజప్ప మాట్లాడుతూ.. అరెస్టును తీవ్రంగా ఖండించారు. టీడీపీ జెండాను చూపి జగన్ భయపడుతున్నారని అన్నారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వ అక్రమాలపై పోరాడతామని పేర్కొన్నారు.