అమరావతి : అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి తీరు మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా రాజధాని అమరావతిపై దుష్ప్రచారం చేయడం మానుకుని నిర్మాణానికి సహకరించాలని కోరారు. ‘‘రాజధాని నిర్మాణానికి కేటాయించిన భూముల్లో ఎలాంటి ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా ఉన్న అమరావతి రెక్కలు విరిచేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు.
సీఎం తీరు మార్చుకోకపోతే భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. రూపాయి ఖర్చు లేకుండా అమరావతి నుంచే పరిపాలన కొనసాగించే అవకాశం ఉన్నా తుగ్లక్ నిర్ణయాలతో 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారు. అమరావతితోనే అభివృద్ధి, యువతకు ఉపాధి, సంపద సృష్టి జరుగుతుందన్న విషయం ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గుర్తించి రాజధాని నిర్మాణానికి సహకరించాలి’’ అని అచ్చెన్నాయుడు సూచించారు