ఆదాయ పన్ను వివరాలను దాఖలు చేసిన తర్వాత అదనపు చెల్లింపులను ఆదాయ పన్ను శాఖ వడ్డీతోసహా తిరిగి చెల్లించడం పరిపాటి. కానీ, కొంత మందికి రిఫండ్ మాత్రమే వచ్చి వడ్డీ రాలేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. సాధారణంగా రిఫండ్లపై వడ్డీ చెల్లింపులకు ప్రతి పన్ను చెల్లింపుదారుడూ అర్హుడే.
పన్ను చెల్లింపుదారుడు సమర్పించిన ఇన్ కమ్ టాక్స్ రిటర్న్ (ఐటీఆర్)లను పరిశీలించిన తర్వాత ఆదాయ పన్ను శాఖ రిఫండ్ లను ప్రాసెస్ చేస్తుంది. ఒకవేళ అవసరమైన దాని కన్నా అధికంగా పన్నును టీడీఎస్ (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) రూపంలో లేదా టీసీఎస్ (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ లేదా అడ్వాన్స్ టాక్స్ చెల్లింపులు లేదా సెల్ఫ్ అసెస్మెంట్) రూపంలో చెల్లిస్తే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అయితే అసలు చెల్లించాల్సిన పన్ను కన్నా కేవలం పది శాతంలోపే అదనపు చెల్లింపులు ఉంటే ఎలాంటి రిఫండ్ రాదు. ఉదాహరణకు మీరు లక్ష రూపాయల పన్ను చెల్లించాల్సి ఉండగా, లక్షా పదివేలను చెల్లిస్తే, ఆ అదనంగా చెల్లించిన పదివేలు రిఫండ్ రాదు. అంతకు మించి చెల్లించే మొత్తాలపై 0.5 శాతం వడ్డీని చెల్లిస్తారు. అలాగే పన్ను దాఖలును గడువులోగా సమర్పిస్తేనే రిఫండ్లకు అర్హత ఉంటుంది.