తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ ఉదయం జరిగిన చక్రస్నానం ఘట్టంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. మూల విరాట్ అభిషేకం అనంతరం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఇక జస్టిస్ ఎన్వీ రమణకి ఈవో జవహర్రెడ్డి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం, 2022 క్యాలెండర్, టీటీడీ తయారుచేసిన అగరబత్తులను అందజేశారు.
కాగా, శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమయూర్తులు జస్టిస్ లలితకుమారి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరాజన్ తర అధికారులు పాల్గొన్నారు.