గజ్వేల్ అర్బన్, జూన్ 10: వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలతో గిట్టుబాటు అంతంతేనని, కరోనాతో పెట్టుబడి భారం పెరిగినా అందుకు అనుగుణంగా మద్దతు పెంపు జరగలేదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతున్నది. జిల్లాలో పండే ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్నకు పెంచిన మద్దతుపై రైతుల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతున్నది. పెరిగిన వ్యవసాయ పెట్టుబడులకు అనుగుణంగా పెంపుదల చేస్తే బాగుండేదని భావిస్తున్నారు. గతేడాది నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి, పత్తి సాగు విస్తీర్ణం బాగా పెరిగాయి. ఈసారి కూడా ఈ పంటల సాగు విస్తీర్ణం బాగానే ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. క్వింటాలు వరికి రూ 72, పత్తికి రూ 200 నుంచి రూ 211 పెరగగా, మొక్కజొన్నకు మాత్రం రూ.20 మాత్రమే మద్దతు ధరను కేంద్రం పెంచింది. కందికి రూ.300, పెసరుకు రూ.79, పొద్దుతిరుగుడుకు రూ.130, జొన్నకు రూ.118, సోయాకు రూ.70 మద్దతు ధర పెరిగింది. వానకాలం పంటలకు వరి సాధారణ రకానికి రూ.1940, వరి ఏ-గ్రేడ్కు రూ.1960 వర్తిస్తుంది. పత్తి పొట్టి పింజా రకానికి రూ.5726, పొడువు పింజా రకానికి రూ .6025, మొక్కజొన్నకు రూ.1870, కందులు రూ.6300 మద్దతు ధరను ఖరారు చేసింది.
కష్టకాలంలో…
రెక్కలు ముక్కలు చేసుకుని తాము పండిస్తున్న పంటలలకు మద్దతు ధర అంతంత మాత్రంగానే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఖరారు చేసిన మద్దతు ధరలు తమకు గిట్టబాటు కావని రైతులు చెబుతున్నారు. కూలి ధరలతో పాటు వ్యవసాయ పనిముట్లు, ముడి పదార్థాలు, యాంత్రిక పనుల ధరలు విపరీతంగా పెరగగా, అం దుకు అనుగుణంగా మద్దతు ధర ప్రకటిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. కరోనా సమయంలో కుల వృత్తులు, ఉద్యోగులు చాలా మంది తమ పనులను మానుకొని ఇండ్లకే పరమితమయ్యారు. రైతులు మాత్రం పగలు,రాత్రి, ఎండ వాననక వ్యవసాయ పనులు చేశారు. లాక్డౌన్ సమయంలో కూడా వరికోతలు, ధాన్యం కొనుగోళ్లు జరగగా, రైతులు పనిచేయక తప్పలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రత్యేక ప్రాధాన్యతతో నూర్పిళ్లు, కొనుగోళ్లు సజావుగా జరిగాయి. డీజిల్ ధర బాగా పెరగడంతో వ్యవసాయ యంత్ర పనులు ధరలు బాగా పెరిగాయి. ఇతర వ్యవసాయ ఉపయోగ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో వ్యవసాయ పెట్టుబడి బాగా పెరిగింది.
కేసీఆర్ చొరవతోనే గిట్టుబాటు…
సీఎం కేసీఆర్ చొరవతోనే గత వానకాలం సన్నాల రైతుకు గిట్టబాటు లభించింది. కేంద్రం విధానాలతో సన్నాలను సాధారణ రకంగా దొడ్డు వడ్లకన్నా తక్కువు మద్దతు ధర వర్తిస్తుంది. రాష్ట్రంలో సన్నాలు ఎక్కువగా సాగుచేయడంతో రైతుకు గిట్టబాటు అందించడం కోసం ఏ-గ్రేడ్ ధర సన్నాలకు వర్తింప జేశారు. యాసంగిలో దొడ్డు రకాలకు ఏ-గ్రేడ్ వర్తించినా, పంట దిగుబడులు బాగా రావడం, కేంద్ర విధానలతో కొనుగోళ్లు ఇబ్బందిగా మారినా, రైతుకు నష్టం జరగకుండా ధాన్యాన్ని అంతా కొనుగోలు జరిగే విధంగా సీఎం కృషిచేశారు. వానకాలం పంటలు సాగు ప్రారంభమైనా, ఇంకా యాసంగి వడ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయి.