న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పదునైన పంచ్లతో పతకాలు కొల్లగొట్టిన హర్దీప్ కౌర్ ఇప్పుడు జీవనం కోసం రోజు కూలీగా మారింది. కుటుంబాన్ని పోషించేందుకు రోజుకు రూ.300 సంపాదన కోసం పొలాల్లో పని చేస్తున్నది. పంజాబ్లోని మన్సా జిల్లా గుర్నేకాలాన్కు చెందిన 23 ఏండ్ల హర్దీప్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో దాదాపు 20 పతకాలు సాధించింది. అయితే ఆర్థిక కష్టాల వల్ల ఇప్పుడు కూలీగా మారింది. దినసరి కూలీగా పొలంలో పని చేసే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదంటూ హర్దీప్ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఫిజికల్ ఎడ్యుకేషన్లో పీజీ చేస్తున్న హర్దీప్తో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా కూలీలుగా పని చేస్తున్నారు. 2018లో మలేషియాలో జరిగిన పోటీల్లో స్వర్ణం సాధించిన హర్దీప్కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అప్పటి పంజాబ్ క్రీడామంత్రి రాణా గుర్మీత్ హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగం కోసం తాను నాలుగుసార్లు తిరిగినా ఎలాంటి ఫలితం లేదని హర్దీప్ చెప్పింది.