శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలు పొడిగించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. సోమవారం నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కర్ఫ్యూ సమయాల్లో మార్పులు చెయ్యడంతో వివిధ ప్రాంతాల నుండి క్షేత్రానికి వచ్చే యాత్రికుల సౌలభ్యం కోసం ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్టు చెప్పారు.
అదే విధంగా స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య కైంకర్యాలతో పాటు సాయంత్రం ప్రదోషకాల నివేదనలు, మహామంగళ హారతులు, అమ్మవారికి ఆస్థానసేవ, లీలా కళ్యాణోత్సవం, ఏకాంతసేవలు యధావిదిగా జరుగుతాయన్నారు. క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నెగిటివ్ సర్టిఫికెట్తో రావాలని సూచించారు.
సోమవారం నుండి కళ్యాణకట్ట పున:ప్రారంభం
కొవిడ్ కారణంగా గత నెల రోజులుగా నిలిపి వేసిన కళ్యాణకట్ట సోమవారం తెల్లవారుజాము నుండి పున:ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు మొక్కులు చెల్లించేందుకు, తలనీలాలు సమర్పించుకునేందుకు తగిన భద్రతా ప్రమాణాలు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.