అమరావతి : వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కేసును ఛేదించేందుకు సీబీఐ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా ఇవాళ కడప నుంచి పులివెందులకు రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి. పులివెందులలోని వివేకా ఇంటిని సీబీఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన భార్య సౌభాగ్యమ్మతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డితోనూ పలు అంశాలపై మాట్లాడారు. హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు వరుసగా 20 రోజులపాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు వివేకా సన్నిహితులను సైతం విచారించారు. త్వరలో ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.