అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. విచారణలో భాగంగా శుక్రవారం కడప జిల్లా పులివెందులకు రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి. పులివెందులలో వివేకానంద ఇంటిని సీబీఐ అధికారులు మరోసారి పరిశీలించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ఇంటిని సైతం అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లాలో పలువురు అనుమానితులను ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివేకా హత్య కేసులో 12 మంది అనుమానితులను ఢిల్లీ కేంద్రంగా దాదాపు 2 నెలలు విచారించిన సీబీఐ.. మలివిడతగా కడపలో విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో వివేకా ప్రధాన అనుచరులతోపాటు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ విచారించి విలువైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.