వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆరే
రైతును గుండెల్లో పెట్టుకుని చూసుకొంటాం
చివరి గింజ వరకూ కొనుగోలు
మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ధాన్యం ఉత్పత్తిలో కల్లూరు అగ్రగామి
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
పెనుబల్లి, కల్లూరు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కోటి ఎకరాల్లో వరి సాగు చేసి దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం వెలుగొందుతున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కల్లూరు మండలం లింగాల, పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 431 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టును వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -ఖమ్మం, ఏప్రిల్ 6
ఖమ్మం, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : ఆరుగాలం శ్రమించే రైతును గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కల్లూరు మండలం లింగాల, పెనుబల్లి మండలం కుప్పెనకుంట గ్రామాల్లో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కనీస మద్దతు ధరతో దేశంలో ఎక్కడ లేనివిధంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతుల శ్రేయస్సు సీఎం కేసీఆర్కు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదన్నారు. జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది జిల్లాలో 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అధిక దిగుబడి రావడంతో రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఇబ్బందులు తొలిగిపోయాయని, ధాన్యం రవాణా, నిల్వకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. జిల్లాలో 431 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు ఇబ్బంది కలుగుకుండా ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లోనే నగదు నేరుగా రైతు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా పనులు చేపడుతున్నామన్నారు. రైతు పండించిన పంట విక్రయించుకోవడం గతంలో కత్తిమీద సాములాగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడాపరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో రైతులు పండించిన పంటకు దళారుల బెడద తప్పిందన్నారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. వానకాలం, యాసంగిలో కోటి ఎకరాల విస్తీర్ణంలో ధాన్యం పండించడం ద్వారా తెలంగాణ సత్తా దేశానికి తెలియజేస్తున్నామన్నారు. రైతులకు పంట పెట్టుబడి సా యం ముందే అందజేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు.
యాత్రల పేరుతో రైతులను భయపెడుతున్నారు
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత యాత్రల పేరుతో రైతులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీతారామ సాగర్ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్కు గోదావరి జలాలు తరలించి నాగార్జున సాగర్ పాత ఆయకట్టు 3లక్షల ఎకరాలను స్థిరీకరించి సాగునీరు అందించడమే కాకుండా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో మరో 4లక్షల ఎకరాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటి అందించే అవకాశం ఏర్పడనుందన్నారు. నాగార్జున సాగర్ నీటిపై కాంగ్రెస్ ప్రతిపక్ష నేత కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి రావాల్సిన చుక్క నీటి బొట్టును వదులుకోరని, ఇందుకోసం ఎవరితోనైనా పోరాటం చేయడానికి సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
రైతు బాంధవుడు కేసీఆర్ : ఎమ్మెల్యే సండ్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ విపత్కర పరిస్థితుల్లో ఏర్పాటు చేసి, మరో సారి రైతుబాంధవుడు అని నిరూపించుకున్నారని సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో కల్లూరు మండలం ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిందని, గత యాసంగిలో పుల్లయ్య బంజరలో రైతులు అత్యధిక ధాన్యాన్ని పండించారని గుర్తు చేశారు. ఈ ఏడాది సత్తుపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. పెనుబల్లి నుంచి సత్తుపల్లి వరకు ప్రధాన రహదారిని మరమ్మత్తులు చేయాలని, ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరామన్నారు. లంకపల్లి నుంచి కిష్టారం వరకు రహదారి మరమ్మతుల కోసం సింగరేణి సంస్థ రూ.30 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ధాన్యం కొలుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ తపాల్గొన్నారు.