తిరుపతి, మే 26: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా పత్ర పుష్పయాగం బుధవారం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 8 నుంచి10 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామక్షి అమ్మవారి ఉత్సవర్లకు నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృతాభిషేకం, చెరుకు రసం, కొబ్బరినీళ్ళు, విబూది, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం జరిగింది. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరంలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులతో స్వామి, అమ్మవార్లకు పత్ర పుష్ప యాగ మహోత్సవం నిర్వహించారు. లోక క్షేమం కొరకు, ఆలయంలో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పత్ర పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.