సూయెజ్ కాలువలో భారీ రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ ఇరుక్కుపోవడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి భారీ నష్టం వాటిల్లిన మాట నిజమే. కానీ ఈ ప్రమాదం లేవనెత్తిన ప్రశ్నలను స్వీకరించి ఆత్మవిమర్శ చేసుకోవడంలోనే అంతర్జాతీయ సమాజం విఫలమవుతున్నది. కరోనా చెలరేగినప్పుడు మన జీవన విధానంపై కొంత తాత్తిక చర్చ సాగింది. కానీ మళ్లీ లాక్డౌన్లు ఎత్తివేసి, ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం కాగానే మన జీవన శైలి గురించిన చర్చనంతా మరిచిపోయాము. ఇంకా కరోనా కలవర పెడుతూనే ఉన్నది. సూయెజ్ కాలువ అంతరాయం విషయంలోనూ- నిలిచి పోయిన రవాణా నౌకల గురించీ, ప్రపంచ వాణిజ్యానికి జరిగిన నష్టం గురించి మాత్రమే చర్చ సాగుతున్నది. కానీ ఒక చోట ప్రమాదానికి మనం ఇంతగా తల్లడిల్లవలసిన అవసరం ఉన్నదా? ప్రపంచ వాణిజ్యం, భారీ రవాణా మితిమీరిపోతున్నాయా? అనేది ఆలోచించుకోవలసిన సందర్భాన్ని ‘సూయెజ్ అంతరాయం’ కల్పించింది.
19 వ శతాబ్దం ఉత్తరార్ధంలో సూయెజ్ కాలువను తవ్వడం గొప్ప విషయమే. మానవాళి తన సౌకర్యం కోసం మధ్యధరా సముద్రాన్ని ఎర్రసముద్రంతో అనుసంధానం చేస్తూ ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్యగా ఒక స్పష్టమైన జల రేఖను గీసింది. దక్షిణ అట్లాంటిక్ జలాలనుంచి హిందు మహాసముద్ర దక్షిణ ప్రాంతానికి నౌకలు చుట్టూరా తిరుగుతూ రావలసిన ప్రయాస తప్పింది. లండన్ నుంచి అరేబియా సముద్రం వరకు దాదాపు ఐదున్నర వేల మైళ్ల ప్రయాణం తగ్గడం వల్ల కాలం కలిసి వస్తుంది, ఆర్థికంగానూ లాభదాయకం. కానీ అంతర్జాతీయ వాణిజ్యం అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నది. నౌకల పరిణామం భారీగా పెరుగుతూనే ఉన్నది. గత ఏడాది 18, 500 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించాయి. సూయెజ్కు ప్రత్యామ్నాయంగా ఆర్కిటిక్ వలయం నుంచి మరో మార్గం ఏర్పాటు చేయాలని రష్యా అంటున్నది. అక్కడ పర్యావరణ విధ్వంసం సాగబోతున్నదనే ఆందోళన ఇప్పటికే ఉన్నది.
సూయెజ్ కాలువలో ఇటీవల నిలిచిపోయిన నౌకలలో ఉన్నవి సగానికి పైగా ఎలక్ట్రానిక్ పరికరాలు, దుస్తులు, కార్ల విడిభాగాలు మొదలైనవి. వాస్తవానికి అనేక వస్తువులను ఖండాంతరాలు తరలించాల్సిన అవసరం లేదు. ఎక్కడి సమాజాలు అక్కడ తయారు చేసుకోగలవు. కానీ అత్యధిక లాభం కోసం ఈ రవాణాలు సాగుతున్నాయి. గత ఏడాది కరోనా పేట్రేగినప్పుడు యూరప్లో సరిహద్దులు మూసివేస్తే బ్రిటన్లో ఆహార పదార్థాలకు కొరత ఏర్పడింది. యూరప్ను మంచు గాలులు కమ్మినప్పుడు జన జీవనం అల్లకల్లోలమైంది. ఇంత డిజిటల్ టెక్నాలజీతో ఎన్ని లెక్కలు కడితేనేం? కరోనా కమ్మిన మొదట్లో కొన్ని నెలల పాటు అమెజాన్ సంస్థ తమ ఉద్యోగులకు మాస్క్లు తగినన్ని సరఫరా చేయలేక పోయింది! ప్రజల రాకపోకలకు, వాణిజ్యానికి పూర్తి హద్దులు అవసరం లేదు. పరస్పరం ఆధారపడటంలో తప్పు లేదు. కానీ స్వయం పోషకత్వాన్ని కోల్పోవడం మాత్రం ఏ సమాజానికీ శ్రేయస్కరం కాదు.