అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును పటిష్ఠం చేశారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేస్తామని తెలిపారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించారు.
ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నాయి. ఏపీలోని మొత్తం 13 జిల్లాల్లో 206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపునకు వీలుగా 206 కేంద్రాల్లో 958 హాళ్ల ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఏర్పాట్లు, పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమించారు. ఇప్పటికే కలెక్టర్లు, అధికారులను ఎస్ఈసీ సమాయత్తం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసుశాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నది.
ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. గొడవలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాలపై నిఘా పెట్టింది. అన్ని చోట్లా సెక్షన్ 144 అమలు చేయనున్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు. ఊరేగింపులు, పటాకులు కాల్చేందుకు అనుమతి నిరాకరించారు. రాజకీయపార్టీలు, నేతలు సహకరించాలని పోలీసులు కోరారు. అన్ని జిల్లాల్లోని స్ట్రాంగ్ రూంలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ వీడియో నిఘాలో జరుగుతుందని తెలిపారు.