అమరావతి : తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక సోమవారం మృతిచెందిన 11 మంది కొవిడ్ రోగుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి రూ .10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కొవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.
తమిళనాడు నుండి ఆక్సిజన్ ట్యాంకర్ సమయానికి రాకపోవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. అనంతరం సీఎం జగన్ స్పందిస్తూ.. ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉందన్నారు. సోమవారం గన్నవరం విమానాశ్రయం నుండి ఆరు ఖాళీ ట్యాంకర్లను ఒడిశాకు పంపించాం. సమయాన్ని ఆదా చేసేందుకు వాటిని విమానంలో పంపాం. ఆక్సిజన్ను విదేశాల నుండి ఓడల ద్వారా కూడా తీసుకువస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.