అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తెలుగు అకాడమి పేరును ప్రభుత్వం మార్పు చేసింది. అకాడమికి ఆంధ్రప్రదేశ్ తెలుగు-సంస్కృత అకాడమిగా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమి పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమించింది.
ఉన్నత స్థాయిలో విద్యాబోధన వాహికగానూ, పాలనా భాషగా తెలుగును సుసంపన్నం చేయడానికిగాను 1968, ఆగస్టు 6న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమిని స్థాపించింది. స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ సంస్థ ప్రభుత్వ, పాలనా వ్యవహరాల్లో తెలుగు అమలయ్యేలా చూస్తుంది. ఉన్నత విద్య, తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను ప్రచురిస్తూ ఉంటుంది.
మాజీ ప్రధాని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి పీవీ నరసింహరావు దీని వ్యవస్థాపక అధ్యక్షులు. తెలుగు అకాడమీ ఇప్పటివరకు వేల సంఖ్యలో పుస్తకాలను విడుదల చేసింది. ఏటా 25 లక్షలకుపైగా పుస్తకాలను అచ్చువేస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అకాడమి పేరును మార్పు చేసింది. ఇది విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్నది. తెలంగాణలో అదే పేరుతో కొనసాగుతున్నది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఉన్నది.