సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయంలో చాలామంది రోడ్లపైకి వస్తున్నారు.. అనవసరంగా రోడ్లు, కాలనీలు, బస్తీల్లో తిరుగుతున్నారు.. మాస్కులు కూడా ధరించడంలేదు..నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. దీన్ని సీరియస్గా తీసుకున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్.. కమిషనరేట్లోని పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘ఆపరేషన్ చబుత్రా’ ప్రారంభించారు.. శుక్రవారం రాత్రి సీపీ.. ఎల్బీనగర్, మీర్పేట, బాలాపూర్ ప్రాంతాల్లో ఆకస్మికంగా పెట్రోలింగ్ నిర్వహించారు. మొత్తం 300 మంది యువకులు లాక్డౌన్ నిబంధనలను పాటించకుండా కాలనీ, బస్తీల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. వీరందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి తల్లిదండ్రులను పిలిపించి మరోసారి ఈ విధంగా రోడ్లపై కనిపిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ 300 మందిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పెట్టీ కేసు నమోదు చేసి రూ.1000 జరిమానా విధించారు. ఇక కమిషనరేట్లోని పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేస్తున్నట్లు సీపీ చెప్పారు. కరోనాను నియంత్రించే క్రమంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు.
సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో కూడా ఆపరేషన్ చబుత్రాను నిర్వహిస్తామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే డీసీపీలు ఆయా జోన్లలో ఆపరేషన్ చబుత్రాను ప్రారంభిస్తారని సీపీ పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో యువకులు ఎవరైనా గల్లీ, కాలనీ రోడ్లలో నిబంధనలను ఉల్లంఘించి తిరిగితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.