ముంబై: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్ర కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల్లో అతడికి అపెండిసైటిస్గా తేలడంతో పంజాబ్ ఫ్రాంఛైజీ వెంటనే అతన్ని చార్టర్డ్ ఫ్లైట్లో ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించింది. సోమవారం రాహుల్కు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. శనివారం రాత్రి రాహుల్కు కడుపునొప్పి వచ్చిందని కింగ్స్ యాజమాన్యం ఆదివారం వెల్లడించింది.
ఒక వారం విశ్రాంతి తర్వాత రాహుల్ అన్ని ఫిజికల్ యాక్టివిటీల్లో పాల్గొనవచ్చని డాక్టర్లు ఫ్రాంఛైజీకి వివరించినట్లు తెలిసింది. తప్పనిసరి క్వారంటైన్ పూర్తైన తర్వాత రాహుల్ ఫ్రాంఛైజీ బయో బబుల్లోకి తిరిగి చేరనున్నాడు. రాహుల్ స్థానంలో మయాంక్ అగర్వాల్కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. రాహుల్ ప్రస్తుత సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో 331 పరుగులు సాధించాడు.