AP DGP | రాష్ట్రంలోని టీడీపీ ఆఫీసులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ కార్యాలయం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సంయమనం పాటించాలని డీజీపీ గౌతం సవాంగ్ విజ్ఞప్తి చేశారు. ‘రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజలు ఆవేశానికి లోనుకావొద్దు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించాం’ అని డీజీపీ కార్యాలయం తెలిపింది.
టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇండ్లపై దాడుల నేపథ్యంలో తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.