YS Jagan on Gulab Cyclone | గులాబ్ తుఫాను వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. శనివారం ఆయన తుఫాను పరిస్థితులపై సమీక్షించారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో కోస్తా ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర రీజియన్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని సంసిద్ధం చేశామని సీఎం జగన్కు అధికారులు వివరించారు.
బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో గోపాల్పూర్కి 510 కి.మీ దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో.. కళింగపట్నానికి తూర్పు ఈశాన్య దిశలో 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. అది వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరంలో ఆదివారం సాయంత్రం తీరం దాటొచ్చని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.
తుఫాను వల్ల పూరి గుడిసెలు దెబ్బతినే ప్రమాదముందని అధికారులు అంచనావేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఏపీ, ఒడిశాలో 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని భారత వాతావరణశాఖ తెలిపింది.