అమరావతి : తిరుపతి లోక్సభ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికపై సీఎం జగన్ ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి అఖండ విజయమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు.
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తిని ఉప ఎన్నిక బరిలో నిలుపుతున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 23న నోటిషికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా.. మే 2న ఫలితం వెల్లడికానుంది. తిరుపతితోపాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సైతం ఏప్రిల్ 17నే జరగనుంది.