హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 86 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు చేరాయని అన్నారు. వివిధ పథకాల కింద అర్హుల ఖాతాల్లో నేరుగా రూ.95,528 కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు. పరోక్షంగా ప్రజలకు మరో రూ. 36,197 కోట్ల లబ్ధి చేకూరిందని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలపై 2 డాక్యుమెంట్లను రూపొందించి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రజలకు లబ్ధి చేకూర్చామని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరే కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం అమలు చేశామని అన్నారు. ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.