న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: వచ్చే నెలలో జరుగాల్సిన సీబీఎస్ఈ బోర్డు పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. అలాగే, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 7 వరకు, 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 14 వరకు జరుగాల్సి ఉంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించవద్దంటూ ప్రతిపక్షాలతో పాటు, సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పదోతరగతి పరీక్షలను రద్దుచేస్తూ, 12వ తరగతి పరీక్షలను వాయిదావేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీబీఎస్ఈ చరిత్రలో పరీక్షలను పూర్తిస్థాయిలో రద్దు చేయడం ఇదే తొలిసారి.
సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై కేంద్రప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణవ్యాప్తంగా 250కి పైగా స్కూళ్లల్లోని 40వేలకు పైగా విద్యార్థులు ఉపశమనం పొందనున్నారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం స్వాగతించింది. తెలంగాణ సర్కారు సైతం ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలను వాయిదావేయాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసొసియేషన్ విజ్ఞప్తిచేసింది.
తాజా పరిస్థితుల్లో తెలంగాణలో ఇంటర్, ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు జరుగుతాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవే కాకుండా జేఈఈ మెయిన్స్, పాలిసెట్, ఈసెట్, ఎంసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, పీజీలాసెట్, ఎడ్సెట్ వంటి ప్రవేశపరీక్షలు సైతం జరుగుతాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. రోజురోజుకూ కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సాధ్యమేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెబుతున్నారు. ప్రవేశ పరీక్షల నిర్వహణపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. తుమ్మల పాపిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
మేలో జరుగాల్సిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్షలను ఆలస్యంగా నిర్వహిస్తే గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ప్రవేశాలకు, విదేశాల్లో విద్యను అభ్యసించాలని ప్రణాళికలు వేసుకున్న విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకావచ్చని వాపోతున్నారు.
బోర్డు పరీక్షల నిర్వహణపై సీబీఎస్ఈ తాజా నిర్ణయం నేపథ్యంలో కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) స్పందించింది. కరోనా పరిస్థితులను అంచనా వేశాక.. ఐసీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పది, పన్నెండో తరగతి వార్షిక పరీక్షలను వాయిదా వేస్తూ మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. పరిస్థితులను బట్టి పరీక్షల నిర్వహణపై నిర్ణయిస్తామని బెంగాల్, యూపీ ప్రభుత్వాలు తెలిపాయి. పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామని కర్ణాటక, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి.
వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కావాల్సిన పదోతరగతి పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. అయితే ఈ ఫలితాలను ప్రకటించే విధానంపై సీబీఎస్ఈ బుధవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ‘బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ఈ మార్కులపై అభ్యంతరాలుంటే విద్యార్థులకు ఆఫ్లైన్లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తాం. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత అనువైన సమయంలో ఈ ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహిస్తాం’ అని వెల్లడించింది. ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఏమిటన్నదానిపై బోర్డు స్పష్టతనివ్వలేదు. అయితే ‘అంతర్గత మూల్యాంకనం’ (ఇంటర్నల్ అసెస్మెంట్) ఆధారంగా ఫలితాలను నిర్ణయిస్తామని కేంద్ర మంత్రి పోఖ్రియాల్ ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపారు.
‘వచ్చేనెల 4 నుంచి జూన్ 14 వరకు నిర్వహించాల్సిన 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలు వెల్లడిస్తాం’ అని సీబీఎస్ఈ వివరించింది.