కరోనా పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కోరారు. బుధవారం రామంతాపూర్ ప్రభుత్వ హోమియో వైద్యశాలలో కరోనా వ్యాక్సినేషన్, ఐసొలేషన్ సెంటర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలను కరోనా బారినుంచి రక్షించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కొవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కోరారు. స్వచ్ఛ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా నుంచి రక్షించుకోవాలంటే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. మాస్కులు ధరించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో వ్యాక్సిన్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హోమియో వైద్యశాలలో 100 మందికి సరిపడా బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్యశాలలో ఐసొలేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు అన్ని సదుపాయలు ఉన్నాయన్నారు. కరోనా టెస్టులు విధిగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ జి. వేణుసుకుమార్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ కె. మోహన్లాల్, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, సూరంశంకర్, వినీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.