తిరుమల : తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి 18 నుంచి 20వ తేదీ వరకు (మూడు రోజులు) పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 18న పవిత్రాల ప్రతిష్ట, 19న పవిత్ర సమర్పణ, 20న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవాళ మాడ వీధుల్లో శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుడు విహరించారు.
పవిత్రోత్సవాల అంకురార్పణ కారణంగా ఇవాళ సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్ధు చేసింది. అదేవిధంగా, ఆగస్టు 18 నుండి 20వ తేదీ వరకు వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.